Monday, November 21, 2011

'కీలకం కానున్న కేసీఆర్ ఢిల్లీ పర్యటన'



హైదరాబాద్: మంగళవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అంశంపై వివిధ జాతీయ పార్టీలకు చెందిన నేతల మద్దతును కూడగట్టేందుకు ఆయన ఒక రోజు ముందుగానే హస్తినకు చేరుకుంటున్నారు.ఆయన జాతీయ నేతలతో జరిపే సమాలోచనల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో మద్దతు తెలిపే పార్టీలతో కలిసి పార్లమెంటులో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయంపై ఇందులో చర్చిస్తారని తెలిసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు 42 రోజులు పాటు సకల జనుల సమ్మె చేసినా కేంద్రం పూర్తి స్థాయిలో స్పందించక పోవడంతో కేసీఆర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.దీనికి తోడు తెలంగాణ వాదులు, టీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. తెలంగాణకు అనుకూలంగా 30కి పైగా పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించలేదు. కానీ ఇటీవల సొంత పార్టీ నేతలతో తెలంగాణ విషయంపై చర్చలు జరిపింది. ప్రస్తుతం మరికొన్ని పక్షాలతో కూడా చర్చల ప్రక్రియ కొనసాగిస్తోంది.

కాగా, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకుండా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల పేరుతో కాలయాపన చేస్తోందన్నది కేసీఆర్ ప్రధాన ఆరోపణగా ఉంది. ఇదేసమయంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతుండటం పట్ల ఇందులో తెలంగాణ అంశాన్ని లేవనెత్తాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో ఆయన ఢిల్లీ పర్యటన కీలకం కానుంది.

No comments:

Post a Comment

Thank you for your comment