Wednesday, November 2, 2011

నెంబర్లతో నేతల గేమ్

నవంబరు 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
అవిశ్వాసంపై సర్వత్రా ఉత్కంఠ
అవిశ్వాసం. ఇప్పడు అందరి నోట అదే మాట. కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెట్టాలని చంద్రబాబుకు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ విసరడంతో మళ్లీ మరోసారి అవిశ్వాసం అంశం చర్చకు వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందా? లేక మ్యాజిక్ ఫిగర్‌కు సరిపడా బలం కాంగ్రెస్‌కు ఉందా? ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో ఇప్పడు చర్చంతా అవిశ్వాసంపైనే. అసలు ఇంతకీ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఎంత? కాంగ్రెప్ ప్రభుత్వం మైనార్టీ‌లో పడిందా? లేక ఇతర పార్టీల మద్దతుతో మేజిక్ ఫిగర్‌కు సరిపడా సభ్యులు ఉన్నారా? అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం..
కాంగ్రెస్ బలమెంత?
రాష్ట్ర శాసనసభలో అధికార కాంగ్రెస పార్టీ బలం ప్రస్తుతం 143. అంటే అంకెల ప్రకారం సర్కారు మైనారిటీలో పడిపోయినట్లే. కాని ఎంఐఎం వంటి పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు సరిపడా బలం తమకుందని కాంగ్రెస్ నేతలంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య 294. వాస్తవంగా 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు 156 మంది గెలిచారు. ముగ్గురు స్వతంత్ర సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. అనంతర రాజకీయ పరిణామాల వల్ల వైఎస్ విజయమ్మ పార్టీకి దూరమవడంతో ఆ సంఖ్య 158కి చేరింది. అయితే ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత మొత్తం 17 మంది సభ్యులు కాంగ్రెస్ సభ్యులుగా మారిపోయారు. దీంతో కాంగ్రెస్ బలం 175కు చేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడాన్నినిరసిస్తూ జగన్‌ గ్రూపుకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం 149కు పడిపోయింది. తెలంగాణా రాష్ట్రాన్ని కాంక్షిస్తూ ఇద్దరుకాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లింగయ్యలు రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడు రాజేశ్వర్‌రెడ్డి మరణించడంతో ఆ సంఖ్య 146కు పడిపోయింది. తాజాగా మరో మగ్గురు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ బలం 143 మాత్రమే. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. సాధారణ మెజారిటీకి 147 సభ్యుల సంఖ్య అవసరం. అయితే సర్కారుకు ఎంఐఎం మద్దతు ఉండటంతో కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని చెబుతున్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఇప్పటికిప్పడు సర్కారుకు వచ్చిన నష్టమేమీ లేదని, సాఫీగా కొనసాగుతుందని చెప్పారు.
అసెంబ్లీలో అధికార పక్షం సంగతి అలా ఉంటే ప్రతిపక్షానిది కీలక పాత్ర. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన సమయంలో అకస్మాత్తుగా అవిశ్వాసం తెరమీదకు వచ్చింది. అయితే సభలో అవిశ్వాసం పెట్టే బలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోతే.. ప్రతిపక్షానికి కూడా సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. టిడిపికి చెందిన నాగం జనార్ధన్‌రెడ్డి, గంప గోవర్ధన్, జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాసులురెడ్డి, వేణుగోపాలచారిలు పార్టీకి దూరమయ్యారు. వీరిలో పోచారం రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ తరుపున గెలిచారు. జోగురామన్న, గంపా గోవర్ధన్‌లు అధికారికంగా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో టిడిపి బలం తగ్గింది. మొత్తం సభలో టిడిపి సభ్యుల సంఖ్య 91 మంది అయితే అందులో ఏడుగురు సభ్యులు దూరంగా ఉంటున్నారు. టిడిపి మద్దతుగా సిపిఎంకు చెందిన నలుగురు, సిపిఐకి చెందిన ఒకరు సభలో నిలుస్తారు. టిడిపి అవిశ్వాస తీర్మానం పెడితే సిపిఐ, సిపిఎంలతో పాటు… టిఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజెపి మద్దతిస్తే కిరణ్ సర్కారుకు కష్టాలే.
స్పీకర్ చేతిలో సర్కారు భవితవ్యం….
ఇప్పడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏం చేయబోతున్నారు. ప్రస్తుతం రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తే గతంలో రాజీనామాలు చేసిన వారు తమవి కూడా ఆమోదించమని డిమాండ్ చేస్తారు. అందుకే స్పీకర్ నిర్ణయం మీదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయమే కీలకంగా మారనుంది. తాజాగా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే స్పీకర్ కొత్త సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇప్పటికే తెలంగాణా కోసం కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అలాగే జగన్ వర్గానికి చెందిన దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి రాజీనామాలు చేశారు. వీరు రాజీనామాలు చేసి కూడా నాలుగు నెలలు దాటుతోంది. వీటిపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ 26 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ ముగ్గురి రాజీనామాలు ఆమోదిస్తే మిగిలిన సభ్యుల రాజీనామాలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది. గతంలో రాజీనామాలు చేస్తే అవి స్పీకర్ ఆమోదానికి నోచుకోలేదు. ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. సమావేశాల తేదీ ఇంకా ఖరారు కాలేదు. డిసెంబరు 4వ తేదీ లోపు సమవేశాలు జరగాల్సి ఉంది. జరపకపోతే అసెంబ్లీ రద్దయ్యే అవకాశముంది. ఆరునెలలకొకసారి అసెంబ్లీ సమావేశాలు జరపాలన్న రాజ్యాంగనిబంధన కోసమైనా స్పీకర్ ఖచ్చితంగా సమావేశాల తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 21వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐదు రోజుల సాటు సమావేశాలు నిర్వహించి ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోపే రాజీనామాలపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. మరి స్పీకర్ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కిరణ్ సర్కారు మైనార్టీలో పడినట్లే. అయితే సాంకేతికంగా చూసుకుంటే ఈ ముగ్గురితో పాటు తెలంగాణాకోసం రాజీనామా చేసిన వారి రాజీనామాలను కూడా స్పీకర్ ఆమోదించాలి. లేకుంటే వారు కాంగ్రెస్ సభ్యులుగానే పరిగణిస్తారు. దాని తర్వాత జగన్ వర్గం, టిడిపి ఎమ్మెల్యేల రాజీనామాలు కూడా ఆమోదించాలి. ఇప్పటి వరకూ తెలుగుదేశానికి చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి రాజీనామాల విషయమే తేలలేదు. స్పీకర్ నిర్ణయంపైనే ఇప్పడు సర్కారు భవిష్యత్తు ఆధారపడిఉంది.

No comments:

Post a Comment

Thank you for your comment