Thursday, November 17, 2011

కేకే గ్యాంగ్ ప్రగల్భాలు

బ్రేకింగ్‌లు.. మీటింగ్‌లు తప్ప…. సాధన ఏదీ?
తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలకు దిక్కు తోచడం లేదు. తెలంగాణాపై హైకమాండ్ నాన్చుడు ధోరణిని నిరసిస్తూనే ఏమి చేయాలో తెలీని స్థితిలో పడ్డారు మన టి.కాంగ్రెస్ ఎంపీలు. వారానికొకసారి సమావేశం కావడం… టీవీలకు బ్రేకింగ్‌లు ఇవ్వడం మినహా సాధించేదేమీ లేదని జనానినికి కూడా తెలిసి పోయింది. తెలంగాణా రాదని హైకమాండ్ అధికార ప్రకటన చేసిన తర్వాత రాజీనామాలు చేస్తామంటున్నారు ఎంపీలు. కాని తెలంగాణా ఇవ్వమని హైకమాండ్ స్పష్టంగా ఎందుకు చెబుతుంది? ఎప్పుడు చెబుతుంది? కఠిన నిర్ణయాలు ఎన్నిసార్లు?
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు సిద్దమయ్యారు. సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇదంతా ఇప్పుడు కాదు. తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా చెప్పినప్పుడు మాత్రమే. అదిగో కఠిన  నిర్ణయమని ఇన్నాళ్లు చెపుతూ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇక ఆ కఠిన నిర్ణయం ఏంటో పరోక్షంగా చెప్పారు. తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ అధికారికంగా చెపితే పార్టీ నుంచి బయటికి వస్తామన్నారు. తెలంగాణాపై ప్రధాని  చేసిన వ్యాఖ్యలపై మన టి. ఎంపీలు మండిపడుతున్నారు. ప్రధాని మాటలే తెలంగాణపై తుది నిర్ణయం కాదని.. సోనియా కాని, కోర్ కమిటీ కాని తెలంగాణ ఇవ్వమని చెపితే పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లోపు తెలంగాణపై కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తప్పించి.. ఎస్సార్సీ,ప్యాకేజీ,అభివృద్ది మండలి, సిఎం మార్పు లాంటి  ప్రత్యామ్నయాలు ఒప్పుకోమన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలను తెలంగాణ వాదానికి అనుకూలంగా మల్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు. సమావేశాల సందంర్భంగా తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే అప్పుడు పార్లమెంట్ లో సామూహికంగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు.
అన్నీ అనుమానాలే…..
పార్టీ నుంచి బయటికి రావాలనే నిర్ణయానికి వచ్చిన టి ఎంపీలు తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు చెపుతోందా.. అనే అనుమానాలు ఉన్నాయి. 2004,2009 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. డిసెంబర్ 9 ప్రకటన, ఆ తరువాత 23 ప్రకటన, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఇవ్వన్నీ చేస్తూ కాలయాపన చేస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇవ్వలేమని నేరుగా చెపుతోందా అనేది అనుమానం. కాబట్టీ తెలంగాణ ఎంపీలు పార్టీని వెంటనే వీడే అవకాశాలు లేవు. ప్రస్తుతం వారు పార్టీని వీడుతామని చేసిన ప్రకటన అటు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం, ఇటు తెలంగాణ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం ఏకకాలంలో జరుగుతాయి. అయితే నిజంగా తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ అధిష్టానం చెపితే ఎంపీలంతా పార్టీకి గుడ్ బై చెపుతారా అనేది కూడా అనుమానమే. కొందరు ఎంపీలను కాంగ్రెస్ అధిష్టానం చాలా కాలంగా బుజ్జగిస్తోంది. ఒకవేళ ఎంపీలు బయటికి వచ్చి ఏం చేస్తారనేది అయోమయంగా ఉంది. సొంత పార్టీ పెట్టుకుంటారా.. టిఆర్ఎస్ లోకి చేరుతారా.. ఒకవేళ పార్టీ పెట్టుకుంటే ఎవరూ నాయకుడు. ఇలాంటి ప్రశ్నలకు తెలంగాణ ఎంపీల వద్ద సమాదానాలు లేవు. పూటకో మీటింగ్ పెట్టుకుని బయటకు ప్రగల్భాలు పలికే మన ఎంపీలు కార్యాచరణకు వచ్చేసరికి అమ్మ సోనియా అన్న జపం చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేకే, కోమటరెడ్డి రాజీనామాలు మినహా మిగిలిన వారివి తిరస్కరించారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం నయానో భయానో ఎంపీలను కట్టడి చేసి రెండో ఎస్సార్సీకే ఒప్పించే ప్రయత్నం చేస్తుందన్నది విశ్లేషకుల అంచనా.

No comments:

Post a Comment

Thank you for your comment