Tuesday, November 1, 2011

చంద్రబాబు అండతో కాంగ్రెస్ కు ఢోకా లేదు

చంద్రబాబునాయుడు చల్లని చూపున్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీఆర్‌ఎస్ నేత సోమారపు సత్యనారాయణ అన్నారు. సీమాంధ్ర నేతల పాలనలో తెలంగాణకు న్యాయం జరగదని ఆయన చెప్పారు. అందుకే సీమాంధ్ర పాలన నుంచి విముక్తి పొందడానికే పార్టీకి రాజీనామా చేశామన్నారు. తెలంగాణ సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
సీమాంధ్రులు డబ్బు ఉందన్న అహంతో ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు పట్టుకొని వేలాడితే తెలంగాణ రాదన్న సంకేతాలు పోయాయని చెప్పారు. తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడవు అని అన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తుందనే ఇన్నాళ్లు వేచిచూశామని, తాము పార్టీని వీడి వచ్చాకయినా కళ్లు తెరచి తెలంగాణ ఇవ్వాలని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడమని టీఆర్‌ఎస్ నేత తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. స్టీరింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా రాజీనామాలపై ఎందుకు వెనక్కి తగ్గారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న సమయంలో పదవులు పట్టుకోని వేలాడడానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. తాము ఎవరి ప్రలోభాలకు గురి కాలేదన్నారు. ప్రలోభాలకు లొంగి ఉద్యమాన్ని నీరుగార్చింది మీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Thank you for your comment