Saturday, November 5, 2011

జగన్ జర్నలిజం పాఠాలు

జగన్ కు ఎవరు నేర్పారో గాని, ఎప్పుడు తనమీద ఆరోపణలు వచ్చినా… ఒక్కసారి కూడా ఖండించరు. వెంటనే తన ప్రత్యర్తులు చేసిన అవినీతిని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. “నేనే కాదు, వాళ్లు కూడా చేశారు, కావాలంటే ఇదిగో ఆధారాలు” అన్నట్టే ఉంటుంది ఆయన వాలకం. రాజకీయంలో ఈ పద్ధతికి వైఎస్ పునాదులు వేస్తే, జగన్ పెంచి పోషించారు. తాజాగా తన వాలకాన్ని ఆయన మరోసారి చూపించారు. సీబీఐ ఆయనను విచారించిన వెంటనే “తాను తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది” అనాల్సిన యువనేత… ఇదిగోండి చంద్రబాబు కూడా అక్రమాలు చేశారు. ఆయన్నూ మీరు విచారించాలి అంటూ సీబీఐకి విన్నివించి వచ్చారు. ఇదెక్కడి విచిత్రమో ఆయనే చెప్పాలి మరి.
సీబీఐ సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఓఎంసీ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని అన్నారు. 2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజు ను బదిలీ చేశారన్నారు. అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు. 1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాంమ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రాంమ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని వివరించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు.
“ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొంతకాలం కిందట వారితో జత కలిసిన టీవీ9 వీరందరికీ నేను చెప్పేది ఒక్కటే. పాత్రికేయ నీతిని పాటించండి. మీరు ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏముందో బయటకు చెప్పండి” అన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment