Monday, October 31, 2011

కాంగ్రెస్‌లో కలకలం…

గులాబీ గూటికి ముగ్గురు ఎమ్మెల్యేలు
కాంగ్రెస్‌కు షాక్… వలసల వెనక జగన్?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముగ్గురు గులాబీ గూటికి చేరిపోయారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్టారావు, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన రాజయ్య, కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన సోమారపు సత్యనారాయణలు కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాసలోకి కేసీఆర్ సమక్షంలో చేరారు. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణా విషయంలో నాన్చుడు ధోరణిని నిరసిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యేలు ముగ్గురు ప్రకటించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి మొండి వైఖరి, ఏకపక్ష ధోరణిని కూడా వారు ఎండగట్టారు.
కాంగ్రెస్‌లో కలకలం…
ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. అధికారంలో లేకపోవడం, తెలంగాణాలో టిడిపి బలహీనంగా ఉండటం తదితర కారణాలతో వారు టిఆర్ఎస్‌లో చేరారు. పోచారం శ్రీనివాసులురెడ్డి టిఆర్ఎస్‌లో చేరి బాన్సువాడ ఉపఎన్నికల్లో గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా దేశం నుంచి వీడిపోయారు. అలాగే వేణుగోపాలాచారి వంటి నేతలు కూడా టిఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలే రాజీనామాలు చేసి ఓ ఉద్యమ పార్టీలో చేరడం విస్మయానికి గురిచేస్తోంది. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. స్వయంగా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విషయాన్ని అంగీకరించారు. ఎంతోమంది తమను సంప్రదిస్తున్నారని, స్థానికంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి వారి చేరికపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఇది కాంగ్రెస్ హైకమాండ్‌కు గుబులు పుట్టించే విషయమే. వలసలకు అడ్డుకట్ట వేయడానికి పిసిసి చీఫ్ బొత్స  సత్యనారాయణ ఈరోజు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురుతో పాటు మరెవరున్నారనే విషయంపై జిల్లా అధ్యక్షులతో చర్చించారు. వారిని పిలిపించుకుని బుజ్జగించే పనిలో బొత్స ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికూడా ఇంటలిజెన్స్‌ను రంగంలోకి దించి ఎవరెవరు పార్టీని వీడనున్నారో ఆరా తీస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌కు బొత్స ఫోన్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన విష‍యం చెప్పినట్లు తెలిసింది. ఆజాద్ కూడా కొంత కలవరానికి గురయ్యారని చెబుతున్నారు. మరెవరూ పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బొత్సకు ఆజాద్ సూచించినట్లు సమాచారం.
వలసల వెనక…..
అయితే వలసలకు అనేక కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశంపై ఆలోచిస్తున్న దశలో వలసలు ప్రారంభం కావడం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలదోయడానికేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిడిపి, కాంగ్రెస్‌లను టార్గెట్ చేసుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి రప్పించుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ హస్తం ఉన్నట్లు కాంగ్రెస్ అధినాయకత్వం అనుమానిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఇద్దరికే అవసరం. ఒకరు జగన్, రెండోవారు కేసీఆర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే సీమాంధ్రలో జగన్, తెలంగాణాలో కేసీఆర్ పార్టీలు క్లీన్ స్వీప్ చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారు. అసెంబ్లీలో బలాబలాలు చూసినా కేసీఆర్, జగన్ ఏకమై మరికొందరు ఎమ్మెల్యేలను తమ గూటికి చేర్చుకోగలిగితే సర్కారుపై అవిశ్వాసం పెట్టి మధ్యంతర ఎన్నికలకు పోవచ్చన్నది వారి వ్యూహం. అవిశ్వాసంలో సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇవ్వదన్న నిర్ణయానికి వచ్చిన వీరిరువురూ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే మరికొందరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బాట పడితే కిరణ్ సర్కారు గండంలో పటినట్లే. అయితే ఆకర్ష్‌కు లోనైన ఎమ్మెల్యేలు కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రం నమ్మడం లేదు. కేవలం జగన్ హామీతోనే వారు టిఆర్ఎస్‌లోకి వస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద తెలంగాణాలో కేసీఆర్ కాంగ్రెస్‌ను, టిడిపిని ఫుట్ బాల్ ఆడుతున్నారు. రెండు పార్టీల అధినాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మరో విషయమేమిటంటే టిఆర్ఎస్‌ను ఏ పార్టీలో విలీనం చేయబోనని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. అంటే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం చేయకపోతే తెలంగాణా రాష్ట్రం ఏర్పడదనేది విశ్లేషకులు అభిప్రాయం. విలీనం చేస్తేనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అంగీకరిస్తుందన్నది టి. కాంగ్రెస్ ఎంపీలే చెబుతున్నారు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది.

No comments:

Post a Comment

Thank you for your comment